Site icon HashtagU Telugu

Mallikarjun Kharge : రాజ్య‌స‌భలో ప్ర‌తిప‌క్ష‌నేత ప‌ద‌వికి ఖ‌ర్గే రాజీనామా

Kharge Sashi

Kharge Sashi

ఏఐసీసీ అధ్య‌క్షునిగా మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్టే. రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం `ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి` నిబంధ‌న మేర‌కు ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష‌నేత ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఇక ఖ‌ర్గే అధ్య‌క్షుడు కావ‌డం లాంఛ‌న‌మే. ఎన్నిక‌ల బ‌రిలో శ‌శిథ‌రూర్ ఉన్న‌ప్ప‌టికీ గాంధీ కుటుంబం మ‌ద్ధ‌తుదారునిగా ఖ‌ర్గే గెలుపు ఖాయం అయిన‌ట్టే. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యాన్ని లేఖ ద్వారా సోనియాకు తెలిపారు.

రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా కొత్త వాళ్ల‌ను ఎంపిక చేసి రాజ్యసభ ఛైర్మన్‌కు సోనియా లేఖ రాయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల త‌రువాత గాంధీయేతర అధ్యక్షుడిగా ఖ‌ర్గేను ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీలో వినూత్న పోక‌డ క‌నిపిస్తోంది. ‘G-23’ అసమ్మతి గ్రూపులో కీలక సభ్యుడు శశి థరూర్‌తో ప్రత్యక్ష పోటీలో తలపడుతున్నాడు. పలువురు G-23 నాయకులు అధికారికంగా Mr Khargeకి మద్దతు తెలప‌డం గ‌మ‌నార్హం.

పోటీలో మూడో అభ్యర్థిగా ఉన్న జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి కూడా నామినేష‌న్ వేశారు. నామినేషన్ పత్రాలను సేకరించిన దిగ్విజయ సింగ్ చివ‌రి నిమిషంలో ఖర్గేతో సమావేశమై పోటీ నుండి తప్పుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో నెహ్రూ కుటుంబీకులు తటస్థతను కొనసాగించడానికి ఓటు వేయకపోవచ్చని తెలుస్తోంది.
ఖ‌ర్గే వ‌ర్సెస్ థ‌రూర్
ఖ‌ర్గే, థ‌రూర్ మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 27న జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డేందుకు వాళ్లిద్ద‌రూ మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకుంటున్నారు. పైగా సోనియాను క‌లిసిన త‌రువాత నామినేష‌న్లు వేసిన లీడ‌ర్లు వాళ్లిద్దరు. జీ 23 లీడ‌ర్ల‌లో ఒకరు శ‌శిథ‌రూర్ కాగా, సోనియా మ‌ద్ధ‌తుతో బ‌రిలోకి ఖ‌ర్గే దిగారు. “కాంగ్రెస్‌కు చెందిన భీష్మ పితామహుడు గా ఖ‌ర్గేను థ‌రూర్ వ‌ర్ణించారు. “మేము ప్రత్యర్థులం కాదు, మేము సహచరులం` అంటూ ట్వీట్ చేశారు.