Maldives Vs India : భారత్పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ఉన్న అక్కసు ఒకరి నిండు ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే.. బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడిని అత్యవసర వైద్యం కోసం విల్మింగ్టన్ ద్వీపం నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు తరలించాల్సి వచ్చింది. ఈక్రమంలో విల్మింగ్టన్ ద్వీపంలో ఉన్న భారత్కు చెందిన డోర్నియర్ విమానాన్ని వాడుకునేందుకు అనుమతించాలని ఆ బాలుడి కుటుంబం పెట్టుకున్న రిక్వెస్ట్కు మాల్దీవుల ఏవియేషన్ విభాగం అధికారులు నో చెప్పారు. ఇండియా విమానాన్ని వాడొద్దని స్పష్టం చేశారు. దీంతో గాఫ్ అలీఫ్ విల్లింగిలిలో సదరు బాలుడు చికిత్సపొందుతున్న ఆస్పత్రి సమీపంలో బాధిత కుటుంబీకులు నిరసనకు దిగారు. చివరకు బాలుడి కుటుంబం అత్యవసర సాయం కోరిన 14 గంటల తర్వాత మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఎలాగోలా ఆ బాలుడిని హుటాహుటిన మాలేలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది. ఆరోగ్యం విషమించి దురదృష్టవశాత్తు బాలుడు చనిపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో డోర్నియర్ విమానం తయారైంది. దీన్ని మానవతా సాయం కోసం మాల్దీవులలో భారత్ మోహరించింది. గతంలో దీన్ని ఎయిర్ అంబులెన్సులాగా చాలాసార్లు వాడుకున్నారు. భారత ఆర్మీ తిరిగి వెళ్లిపోవాలని మాల్దీవులలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వాదిస్తోంది. మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు అయినప్పటి నుంచి బాహాటంగానే భారత్తో గ్యాప్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘‘భారత్పై విద్వేషాన్ని వెళ్లగక్కే ప్రయత్నంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Maldives Vs India) ఉన్నారు. ఆయన అక్కసు కోసం దేశ ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంటూ మాల్దీవుల ఎంపీ మిఖాయిల్ నసీమ్ ట్వీట్ చేశారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఆయన ఐదురోజుల పాటు చైనాలో పర్యటించారు. టూరిజం డెవలప్మెంట్లో తమకు సహకరించాలని చైనాను కోరారు. భారత్తో దూరం పెరుగుతున్నందున.. చైనా నుంచి సాధ్యమైనంత ఎక్కువమంది టూరిస్టులను పంపాలని చైనా సర్కారుకు ముయిజ్జు రిక్వెస్ట్ చేశారు.