Site icon HashtagU Telugu

Majority Population : ఇలాగే జరిగితే.. మెజారిటీ ప్రజలు మైనారిటీలు అవుతారు : హైకోర్టు

Court

Majority Population : దేశంలో జరుగుతున్న సామూహిక మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే.. దేశంలోని మెజారిటీ వర్గం జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారిపోతుందని హెచ్చరించింది. ఒక గ్రామంలోని హిందువులు అందరినీ ఒకేసారి క్రైస్తవ మతంలోకి మార్చారనే అభియోగాలను ఎదుర్కొంటున్న హమీర్‌పూర్ జిల్లా మౌదాహాకు చెందిన కైలాష్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సామూహిక మత మార్పిడులను ఆపకుంటే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీగా మారిపోతుంది. మత మార్పిడికి అవకాశమిచ్చే మతపరమైన సమావేశాలను వెంటనే నిలిపివేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లో పొందుపర్చిన మత స్వేచ్ఛ హక్కుకు విరుద్ధమైనవని చెప్పారు. ఆర్టికల్ 25 ప్రకారం.. వ్యక్తులు కొన్ని పరిమితులకు లోబడి ఏదైనా మతాన్ని విశ్వసించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ‘‘ప్రచారం అంటే మతాన్ని ప్రోత్సహించడమే తప్ప.. మరో వ్యక్తిని అతడి మతం నుంచి తమ మతంలోకి  మార్చుకోవడం కాదు’’ అని హైకోర్టు బెంచ్(Majority Population) తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పేదలను తప్పుదోవ పట్టించి క్రైస్తవ మతంలోకి మార్చిన ఉదంతాలు మా దృష్టికి వచ్చాయి’’ అని న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ చెప్పారు. కైలాష్‌పై రాంకాలీ ప్రజాపతి అనే వ్యక్తి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాడు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడిని ఒక వారం పాటు ఢిల్లీకి తీసుకెళ్లి .. క్రైస్తవ మతంలోకి మార్చాడని రాంకాలీ ప్రజాపతి ఫిర్యాదు చేశాడు. మతం మారినందుకు తన సోదరుడికి డబ్బులు కూడా ఇచ్చారని పేర్కొన్నాడు. తన సోదరుడితో పాటు ఊరిలో ఉన్న చాలామందిని కైలాశ్ మతం మార్పించాడని కంప్లయింట్‌లో రాంకాలీ ప్రజాపతి పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుమేరకు విచారణ జరిపిన పోలీసులు కైలాశ్‌ను అరెస్టు చేశారు.

Also Read :Marriage Rituals: పెళ్లిలో వధువుని గంపలో ఎందుకు మోసుకొస్తారో తెలుసా?