గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందగా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోని భయానక దృశ్యాలు కనిపించాయి. ఒక బస్సు బోల్తా పడటంతో ఆ బస్సులో మంటల చెలరేగాయి. మరో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ రెండు బస్సులూ మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC)కి చెందినవి. ప్రమాదం అనంతరం బస్సుల్లో ఒకదానిలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇటు గాయపడిన వారిని బార్డోలీ వ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. సూరత్ రూరల్ ఐజీ ప్రేమ్ వీర్ సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు, బార్డోలీ నుంచి వ్యారా వైపు వెళ్లే జాతీయ రహదారి 56 మార్గంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్లేట్లు కలిగిన రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయని ఆయన అధికారికంగా తెలిపారు. ఈ ఘటనలో ఒక బస్సులో మంటలు చెలరేగగా, మరో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారని.. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 38 మంది గాయపడ్డారని తెలిపారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదంపై సమగ్రంగా దర్యప్తు చేస్తున్నట్లు ఆయన తెలపారు.
