Site icon HashtagU Telugu

Mahila Samman Savings : మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్..

Mahila Samman Savings

Mahila Samman Savings

మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ (Mahila Samman Savings Certificate (MSSC) సర్టిఫికెట్ పొదుపు పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2023 బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రత్యేకంగా మహిళా ఇన్వెస్టర్ల కోసం రూపొందించిన ఈ పథకం వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్‌లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద మహిళలు కనీసం రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళల్లో పొదుపు అలవాటు పెంచడంతో పాటు, పెట్టుబడులు పెట్టే మాధ్యమంగా నిధులను సేకరించడం. ఈ పథకానికి 2 ఏళ్ల టెన్యూర్ ఉండగా, ప్రస్తుతం దీనిపై 7.50% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. వడ్డీని ప్రతి 3 నెలలకు లెక్కించి, మెచ్యూరిటీ సమయంలో అసలుతో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో డబ్బు జమ చేయడానికి బ్యాంకులు లేదా పోస్టాఫీసులను సంప్రదించవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడంలో ఆధార్ మరియు పాన్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ పథకంలో పెట్టుబడి చేసిన ఏడాది తర్వాత 40% వరకు డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తి నిధులు రెండు సంవత్సరాల తర్వాతే పొందవచ్చు. ఉదాహరణకు, గరిష్ట పెట్టుబడిగా ₹2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీకి రూ. 32,044 వడ్డీ పొందవచ్చు. అదే రూ.1 లక్ష జమ చేస్తే రూ.16,022 వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ రేటు అందుబాటులో ఉండటం ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రధాన కారణం.

ఇదే బ్యాంకుల టర్మ్ డిపాజిట్లను పరిశీలిస్తే, ఎస్‌బీఐలో సాధారణ ప్రజలకు 6.80% వడ్డీ రేటు ఉండగా, సీనియర్ సిటిజెన్లకు 7.30% ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7% రేటు అందిస్తుండగా, యాక్సిస్ బ్యాంక్ 7.10% వడ్డీ రేటు ఇస్తోంది. పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లలో కూడా 7% రేటు అందుబాటులో ఉంది. అయితే సాధారణ ప్రజలకు మరియు మహిళా ఇన్వెస్టర్లకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం మరింత లాభదాయకంగా ఉంటుంది.
2025 మార్చి 31నే ఈ పథకం గడువు తీరనుంది. తద్వారా, ఈ పథకంలో చేరాలని భావించే మహిళా ఇన్వెస్టర్లు ఆలోచన లేకుండా త్వరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

Read Also : Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌!