పంజాబ్లోని లుథియానాలో భారీ పేలుడు (Ludhiana blast) చోటుచేసుకుంది. గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు వినయ్ సింగ్, రాహుల్గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్లోని దోరహాలోని రాంపుర రోడ్డులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులను వినయ్, రాహుల్గా గుర్తించారు. వారి వయస్సు 20-25 సంవత్సరాలు. ఇద్దరూ యూపీ వాసులేనని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: New Covid : మళ్లీ దూసుకొస్తోన్న కరోనా, చైనాలో 10లక్షల మరణాల అంచనా
బాయిలర్ పేలుడు ధాటికి ఇనుప షెడ్డు ఎగిరిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో ఆరు నుంచి ఏడుగురు కూలీలు పని చేస్తున్నారు. బాయిలర్ పేలడంతో పక్కనే ఉన్న కూలీలు కాలిపోయారు. ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత శాఖ దర్యాప్తు ప్రారంభించిందని డీఎస్పీ హర్సిమ్రత్ సింగ్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. గాయపడిన వారి పేర్లు రమేష్ కుమార్, హరీష్ కుమార్, బాబులాల్ మిశ్రా, అనిల్ కుమార్ గా పోలీసులు తెలిపారు. మరోవైపు మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను అదుపులోకి తీసుకున్నారు.