Parliament Session : కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఇప్పటికే కొలువుతీరింది. మంత్రివర్గం కూడా ఏర్పాటైంది. ఇక లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రక్రియ జరగాల్సి ఉంది. ఆ వెంటనే లోక్సభ స్పీకర్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందుకోసం జూన్ 24 నుంచి జులై 3 వరకు 8 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను(Parliament Session) నిర్వహించనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ను ఎంపిక చేయనున్నారు. ఈసారి లోక్సభ స్పీకర్ పదవి కోసం బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జేడీయూ కూడా పోటీ పడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు కైవసం చేసుకోగలిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272కు చేరుకునేందుకు టీడీపీ, జేడీయూ లాంటి మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడింది. టీడీపీ వద్ద 16, జేడీయూ వద్ద 12 లోక్సభ సీట్లు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో పలు చోట్ల ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కారణంగా రాజకీయ పార్టీలు రెండుగా చీలిన దాఖలాలు ఉన్నాయి. అందుకు పెద్ద ఉదాహరణ మహారాష్ట్ర. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి లోక్సభ స్పీకర్ పదవి కీలకంగా మారనుంది. దాన్ని ఇతర పార్టీలకు ఇచ్చేందుకు బీజేపీ మొగ్గుచూపుతుందా ? లేదా ? అనేది త్వరలోనే తేలిపోతుంది.