Lok Sabha polls 2024 : లోక్సభ ఎన్నికల ప్రచార నగారా మోగించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈనెల 13 నుంచే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందుకోసం బీహార్లోని చంపారన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు బెతియా పట్టణంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈవివరాలను బీజేపీ వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 ఎంపీ స్థానాల్లో గెలవాలనే ప్లాన్తో బీజేపీ ఉంది. ఇందుకోసం బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. ఈ రాష్ట్రంలోని బెతియా, బేగూసరాయ్, ఔరంగాబాద్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలు ఉంటాయని తెలుస్తోంది. ఆయా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ప్రధాని ఎన్నికల ప్రచారం సాగుతుందని సమాచారం. వచ్చే రెండు నెలల్లో బిహార్లో ఏర్పాటుచేసే అనేక సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుంది. సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్షా ప్రచారం చేయనుండగా.. సీమాంచల్లో జేపీ నడ్డా(Lok Sabha polls 2024 ) పర్యటించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీల కూటమి ఇండియాలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రేసులోనూ ఆయన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీహార్పై బీజేపీ ఫోకస్ను పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సముద్రం తీరాన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ”లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయా. అక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పర్యాటకులు లక్షద్వీప్ను కూడా వీక్షించండి” అని మోడీ ట్వీట్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన పలువురు మాల్దీవుల మంత్రులు అభ్యంతర కామెంట్స్తో ట్వీట్స్ చేశారు. భారత్ను, భారత ప్రధానిని కించపరిచేలా పదాలను ప్రయోగించారు. దీనిపై స్పందించిన సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ”సింధు దుర్గ్లో నా 50వ పుట్టినరోజును జరుపుకొని దాదాపు 250కు పైగా రోజులు గడిచాయి. ఈ తీర ప్రాంతాలు మనకు కావాల్సినవన్నీ అందిస్తాయి. అద్భుతమైన ఆతిథ్యంతో అందమైన ప్రదేశాలతో నాకో జ్ఞాపకాల నిధిని అందించాయి. భారతదేశంలో గొప్ప తీర ప్రాంతాలు, సహజసిద్ధమైన దీవులు ఉన్నాయి. ‘అతిథి దేవో భవ’ సంస్కృతి కలిగిన మన దేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి” అని సచిన్ ట్వీట్ చేశాడు.