Lok Sabha Incident : లోక్సభలో ఇద్దరు దుండగులు హల్చల్ చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన టెకీ సాయికృష్ణ జగాలి. అతడి పూర్వాపరాలను పోలీసులు ఆరా తీయగా.. మాజీ డీఎస్పీ కొడుకు అని వెల్లడైంది. బుధవారం సాయంత్రం సాయికృష్ణను బాగల్కోటెలోని అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి తీసుకెళ్లి విచారించనున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న మరో వ్యక్తిది ఉత్తరప్రదేశ్. ఫేస్బుక్లో డిలీట్ చేసిన భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్లో వీరిద్దరు కూడా సభ్యులేనని పోలీసు వర్గాలు తెలిపాయి.లోక్సభలో రంగు పొగ గొట్టంతో గందరగోళం సృష్టించిన మనోరంజన్ స్నేహితుడే ఈ సాయికృష్ణ జగాలి. బాగల్కోటెకు చెందిన సాయికృష్ణ, మైసూరుకు చెందిన మనోరంజన్ బెంగళూరులోని ఇంజినీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదని సాయికృష్ణ సోదరి మీడియాకు చెప్పారు. ఢిల్లీ పోలీసుల విచారణకు తాము పూర్తిగా సహకరించామని తెలిపారు. ప్రస్తుతం సాయికృష్ణ ఓ కంపెనీ కోసం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడని ఆమె వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టయిన నిందితుల్లో లోక్సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మ, పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే, నీలం ఆజాద్ ఉన్నారు. లలిత్ ఝాను భద్రతా ఉల్లంఘనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. లలిత్తో పాటు అతనికి సాయం చేసిన మహేష్ కుమావత్ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని(Lok Sabha Incident) విచారిస్తున్నారు. ఇక పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై పార్లమెంటు విపక్ష ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం వరకు 143 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు. వీరిలో 97 మంది లోక్సభ ఎంపీలే కావడం గమనార్హం.