Key Candidates : రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రోజు (ఏప్రిల్ 26న) రెండోదశ పోలింగ్ ఘట్టాన్ని భారీ బందోబస్తు నడుమ నిర్వహించనున్నారు. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఓటింగ్ జరుగుతుంది. వాస్తవానికి 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి మరణించారు. దీంతో అక్కడి పోలింగ్ తేదీని మే 7కు వాయిదా వేశారు. రెండో విడతలో పోలింగ్ జరగనున్న కీలకమైన లోక్సభ స్థానాలు, అభ్యర్థులపై(Key Candidates) ఓ లుక్..
We’re now on WhatsApp. Click to Join
రెండో విడత పోలింగ్ విశేషాలు..
- రెండో విడత పోలింగ్ కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లో జరగనుంది.
- కర్ణాటకలోని 14, రాజస్థాన్లోని 13, మహారాష్ట్రలోని 8, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6, అసోం, బిహార్లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్గఢ్, బెంగాల్లలోని చెరో 3 స్థానాలు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలోని చెరో స్థానంలోనూ ఓటింగ్ జరుగుతుంది.
- కాంగ్రెష్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా తలపడుతున్నారు.
- బీజేపీ నేత హేమ మాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మధుర నుంచి హేమమాలిని గెలిచారు.
- రామాయణం సీరియల్లో రాముడి పాత్రలో నటించి ఫేమస్ అయిన టీవీ నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఎస్పీకి చెందిన దేవవ్రత్ కుమార్ త్యాగి, సమాజ్వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మ ఈ స్థానంలో అరుణ్ గోవిల్తో తలపడుతున్నారు.
- కాంగ్రెస్ నేత శశి థరూర్ మరోసారి తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఢీకొంటున్నారు.
- ఇక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ రాజ్నంద్గావ్ లోక్సభ సీటు నుంచి బరిలోకి దిగారు.
- రాజస్థాన్లోని జోధ్ పూర్ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్లోని కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్నారు.
- వంచిత్ బహుజన్ ఆఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ మహారాష్ట్రలోని అకోలా నుంచి పోటీ చేస్తున్నారు.
- బాలూర్ఘాట్ సీటు నుంచి బీజేపీ బెంగాల్ ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ బరిలోకి దిగారు.