BJP Candidates : బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). ప్రధాని మోడీ, ఎల్కే అద్వానీ, వాజ్పేయి, అమిత్షా వంటి దిగ్గజ నేతలంతా గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. అయితే గత పదేళ్ల వ్యవధిలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వాళ్లకు లోక్సభ టికెట్లను కూడా కాషాయ పార్టీ కేటాయించింది. కొంతమందిని రాజ్యసభకు పంపింది. మరికొందరికి బీజేపీలో పార్టీపరమైన కీలక పదవులను కట్టబెట్టారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ(BJP Candidates) టికెట్ పొందిన వారిలో భారీసంఖ్యలో ఫిరాయింపుదారులు ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఈ లోక్సభ పోల్స్లో దేశవ్యాప్తంగా పోటీచేస్తున్న 435 మంది బీజేపీ అభ్యర్థుల్లో 106 మంది ఇతర పార్టీల ఫిరాయింపుదారులే. వారిలోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించిన వారే కావడం గమనార్హం. ఈసారి ఎలాగైనా 400 లోక్సభ సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ.. వ్యూహాత్మకంగానే ఇతర పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకుంది. దీనివల్ల ఆయా నేతలు గత కొన్ని ఏళ్లుగా వారివారి లోక్సభ స్థానాల పరిధిలో రెడీ చేసుకున్న క్యాడర్ బీజేపీకి అందుబాటులోకి వచ్చింది. బీజేపీకి సొంత క్యాడర్ పెద్దగా లేని చోట ఇలాంటి కీలక నేతల ఫిరాయింపులు బాగా కలిసొస్తాయని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.