కోల్కతాలో ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.లేక్ టౌన్ ప్రాంతంలో నకిలీ కాల్ సెంటర్ రాకెట్ను నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళలతో సహా 12 మందిని అరెస్టు చేశారు. స్మార్ట్ ఫోన్లు, హాజరు రిజిస్టర్లు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, డాంగిల్స్, బాధితుల పేర్లతో కూడిన పత్రాలతో పాటు సుమారు రూ.45,000 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్టర్ కాని సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమ ఇళ్లలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రతిపాదిస్తూ భారతదేశం అంతటా ప్రజలను నిందితులు సంప్రదించేవారని పోలీసులు తెలిపారు. నగదు బదిలీ చేయడానికి, మోసగాళ్లు తమ ఖాతాదారుల బ్యాంక్ వివరాలను అడుగుతున్నారని.. అయితే బ్యాంకు వివరాలు అందడంతో వారు బాధితుల ఖాతాల నుంచి మొత్తం నగదును లూటీ చేసేవారిని పోలీసులు తెలిపారు. బెంగాల్లోని లేక్టౌన్లో ఉన్న BM ఫాస్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కార్యాలయం గత నెల రోజులుగా కాల్ సెంటర్ని నడుపుతుంది. కాల్ సెంటర్ను ప్రధానంగా బాద్షా మండల్, అభిషేక్ సామంత్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా బిధాన్ నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. కాల్ సెంటర్ నిర్వహణ కోసం చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ను అందించడంలో విఫలమవడంతో, పోలీసులు కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు, ఇద్దరు మహిళలతో సహా 12 మందిని అరెస్టు చేశారు. లేక్ టౌన్ ఏరియాలో ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అని బిధాన్ నగర్ పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. అరెస్టయిన నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నేడు బిధాన్ నగర్ కోర్టులో హాజరుపరచనున్నారు.