ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.క ఉత్తర భారత రాష్ట్రాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివేదించాయి.ఇటు హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో భారీ వర్షాల కారణంగా బియాస్ నదికి వరద నీరు పోటెత్తింది.బియాస్ నది వద్ద రోడ్లన్ని కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మంగళవారం కులు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి.. పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్, గౌరీకుండ్లలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం నిరంతర ప్రతికూల వాతావరణం కారణంగా సోన్ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద ప్రయాణికులను నిలిపివేసింది. హిమాచల్ ప్రదేశ్ అధికారులు వరదలపై సమీక్ష నిర్వహించారు. దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ మూడు రోజుల్లో 31 మంది మరణించారని తెలిపారు.