ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని రుద్రప్రయాగ్ జిల్లా (Rudraprayag District)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-34, రాష్ట్ర రహదారి -77లో కొంత భాగాన్ని మూసివేసినట్లు తెహ్రీ గర్వాల్ లోని జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రసిద్ద కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఉత్తరాఖండ్ వ్యాప్తంగా మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేదార్నాథ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులను సోన్ప్రయాగ వద్ద నిలిపివేశారు. అక్కడ వారు తలదాచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ధామి ఆకస్మికంగా సందర్శించారు. ఆదివారం ఉదయం ఐదు వేల మంది వరకు యాత్రికులు సోన్ప్రయాగ నుంచి కేదార్నాథ్కు వెళ్లారని అధికారులు సీఎంకు వివరించారు. అయితే, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదిలాఉంటే ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న చార్దామ్ యాత్రలో ఈ ఏడాది 30లక్షల మంది యాత్రికులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 10లక్షల మందికిపైగా భక్తులు కేదార్నాథ్ ధామ్ను సందర్శించినట్లు తెలిపారు.
చార్ ధామ్ యాత్ర నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అయితే, గంగోత్రి, యమునోత్రిని ఏప్రిల్ 22న భక్తుల కోసం తెరిచారు. అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరవబడింది. కేదార్ నాథ్ ధామ్ ను ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27న తెరుచుకున్నాయి.
TDP : అచ్చెన్న ఇదేం పద్దతన్నా అంటున్న తెలుగు తమ్ముళ్లు.. అధ్యక్షుడిపై గుర్రుగా క్యాడర్..!