Mann Ki Baat : జీ20 కూటమిలో ఆఫ్రికా యూనియన్ కు సభ్యత్వం కల్పించడం ద్వారా భారత్ తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. చంద్రయాన్ 3 విజయం.. ఆ వెంటనే జీ20 సదస్సు విజయంతో భారతీయుల ఆనందం రెట్టింపైందని చెప్పారు. ఈరోజు ఉదయం మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. జీ20 వేదికగా ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’ పై భారత్ చేసిన ప్రతిపాదన ప్రపంచ వాణిజ్యంలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. చంద్రయాన్-3, జీ20 విజయంపై తనకు పెద్దసంఖ్యలో లేఖలు వచ్చాయని మోడీ అన్నారు. ‘‘చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ని యూట్యూబ్ ఛానెల్లో 80 లక్షల మందికి పైగా చూశారు. చంద్రయాన్ 3 మహా క్విజ్లో కూడా అందరూ పాల్గొనాలి’’ అని దేశ ప్రజలను ఆయన కోరారు.
సెప్టెంబర్ 26న జరిగే జీ20 యూనివర్సిటీ కనెక్ట్ కార్యక్రమంలో తాను పాల్గొంటానన్న మోడీ.. కాలేజీల విద్యార్థులంతా ఇందులో పాల్గొనాలన్నారు. ఐఐటీ, నిట్స్, మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులూ ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్, కర్ణాటకలోని హోయసల ఆలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడం దేశానికి గర్వకారణమన్నారు. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో పిల్లల కోసం వినూత్నమైన ఘోడా లైబ్రరీ (గుర్రంపై పుస్తకాలు ఉండే లైబ్రరీ)ని ప్రారంభించడాన్ని మోడీ (Mann Ki Baat) మెచ్చుకున్నారు. దాదాపు 12 గ్రామాల్లో పిల్లలకు ఈ లైబ్రరీలను అందుబాటులోకి తెచ్చారని ప్రధాని చెప్పారు.