Jharkhand Polls : వచ్చే నెలలో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్ ఐపీఎస్ క్యాడర్లో అందుబాటులో ఉన్న అత్యంత సీనియర్ అధికారికి తాత్కాలిక డీజీపీగా బాధ్యతలను అప్పగించాలని ఈసీ నిర్దేశించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, దీనిపై ఇవాళ సాయంత్రం 7 గంటల్లోగా నివేదికను అందజేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
Also Read :NCW Chairperson : జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా విజయ కిషోర్ రహత్కర్
డీజీపీ అనురాగ్ గుప్తాపై(Jharkhand Polls) గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల టైంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు పార్టీలు ఆరోపించాయి. దీనిపై తాజాగా ఈసీకి పలు ఫిర్యాదులు అందాయని తెలిసింది. వాటి ఆధారంగానే డీజీపీ అనురాగ్ గుప్తా తొలగింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. జార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.