RLD – BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్ఎల్డీ పార్టీ అధినేత జయంత్ చౌదరీ ఇండియా కూటమిని వీడేందుకు రెడీ అయ్యారు. ఆయన బీజేపీతో చేతులు కలపాలని డిసైడ్ అయ్యారట. యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు జయంత్ చౌదరీ యోచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులపై ఆయన బీజేపీ(RLD – BJP) అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిపారట. ఆర్ఎల్డీ నేతలు ఏడు లోక్సభ స్థానాలను డిమాండ్ చేయగా, బీజేపీ 5 సీట్లు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిందట. దీనిపై ఆర్ఎల్డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. యూపీలోని కైరానా, మథుర, బాగ్పత్, అమరోహ్ స్థానాలను ఆర్ఎల్డీకి ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనిపై ఆర్ఎల్డీ జాతీయ కార్యదర్శి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎల్డీ, బీజేపీ పొత్తు ఫిక్స్ అయ్యింది. మాకు 4 నుంచి 5 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పింది. మేం వాళ్లను 7 సీట్లు అడుగుతున్నాం. మా పార్టీ అధినేత జయంత్ చౌదరీ ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులతో చర్చిస్తున్నారు. ఈ చర్చలు త్వరలోనే పూర్తవుతాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేస్తాం’’ అని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
2022 సంవత్సరంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) , సమాజ్ వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్రీయ లోక్దళ్ 33 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. 8 మంది ఆర్ఎల్డీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మరో ఎమ్మెల్యే గెలవడంతో ఆ సంఖ్య 9కి పెరిగింది. ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరీ రాజ్యసభకు వెళ్లేందుకు సమాజ్వాదీ పార్టీ సహకరించింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ ఇటీవల ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీని తాము 12స్థానాలను కోరామని.. ఏడు సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ ఒప్పుకున్నారని అప్పట్లో ఆర్ఎల్డీ నేతలు చెప్పారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే ఆర్ఎల్డీ మాట మార్చడం గమనార్హం. బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడం వల్ల ఆర్ఎల్డీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.