అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir) ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది. మరోపక్క దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది.
ఈ తరుణంలో ఓ ముస్లిం యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఈ యువతి పేరు సయ్యద్ బటూల్ జెహ్రా (Batool Zehra) (19). పహారీ భాషలో (Pahari language) ఆమె ఆలపించిన రామ్ భజన (Ram bhajan) పాటకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడు… రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై ఆమె మాట్లాడుతూ… గాయకుడు జుబిన్ నౌటియాల్ హిందీలో పాడిన రామ్ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందన్నారు. యూట్యూబ్లో హిందీలో జుబిన్ పాడిన రామ భజనను చూశానని… తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని.. దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. దానిని హిందీ నుంచి పహారీలోకి అనువదించి రామ్ భజన పాడానన్నారు. తాను ముస్లి అయినప్పటికీ రామ్ భజన పాడటం తప్పేమీ కాదన్నారు. తమ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ హిందూ అని.. కానీ ఆయన అభివృద్ధి విషయంలో మతాన్ని చూడరన్నారు. హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ సోదరులేనని తాను నమ్ముతానని తెలిపింది.
మరోపక్క పాకిస్థాన్లో కూడా రాముని కీర్తనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా కాషాయ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రామమందిరాన్ని సందర్శించడానికి ఉత్సాహంగా ఉన్నానన్నాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయోధ్య రామమందిరం గురించి ఒక ఆసక్తికర పోస్ట్ను పంచుకున్నాడు. ఇందులో చేతిలో కాషాయ జెండాను పట్టుకుని కనిపించాడు డానిష్ కనేరియా. ‘ అయోధ్యలో మన రాజు శ్రీరాముని మహా మందిరం సిద్ధంగా ఉంది. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన పనులకు కొద్దీ రోజులు మాత్రమే మిగిలి ఉంది’ అని రాసుకొచ్చిన పాక్ క్రికెటర్ చివరిలో జై-జై శ్రీరాం అని క్యాప్షన్ ఇచ్చాడు.
#WATCH | Jammu and Kashmir: Batool Zehra, a college Ist year student from Uri sings Ram bhajan in Pahari language to connect J&K with the Ram Mandir Pran Pratishtha ceremony, to be held on 22nd January in Ayodhya, UP. pic.twitter.com/Fla4BiCh9u
— ANI (@ANI) January 15, 2024