Site icon HashtagU Telugu

20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్‌కాల్‌లో ప్రధాని

20 Years Insults

20 Years Insults

20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో ఓ ఎంపీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను అనుకరించారు. ఈవిషయం మీడియా ద్వారా తెలియడంతో ఉపరాష్ట్రపతికి  ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేశారు. ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేశారు.  తాను కూడా గత 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలనే అనుభవిస్తున్నానని(20 Years Insults) ప్రధాని చెప్పారంటూ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఓ ట్వీట్ చేశారు.  వైస్ ప్రెసిడెంట్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారికి సాక్షాత్తూ పార్లమెంటులో ఇలా జరగడం దురదృష్టకరమని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపారు. ‘‘కొంతమంది వెకిలి చర్యలు విధి నిర్వహణలో నన్ను ఆపలేవు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను అమలు చేయకుండా నన్ను ఆపలేవు’’ అని తాను ప్రధానికి చెప్పానని జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తెలిపారు. ‘‘నేను విలువలకు కట్టుబడి నడుచుకునే మనిషిని. వాటిని ఎన్నటికీ విడనాడను. ఎంతటి అవమానమైనా  నా మార్గం నుంచి నన్ను దారి తప్పించలేదు’’ అని పీఎంకు చెప్పినట్లు ఉప రాష్ట్రపతి వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే.. 

ఇక ఈ ఘటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఖండించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉపరాష్ట్రపతిని అవమానించేలా కొందరు ఎంపీలు ప్రవర్తించిన తీరును చూసి నిరాశకు గురైనట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాడుకోవచ్చని.. అయితే అందులో గౌరవభావం ఉండాలని హితవు పలికారు. భారతదేశం గర్వించదగిన పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు.

Also Read: Modi Vs Kharge : ఖర్గే వర్సెస్ మోడీ.. ప్రధాని అభ్యర్ధి ఛాన్స్ కాంగ్రెస్ చీఫ్‌కేనా ?

అసలేం జరిగింది ?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మంగళవారం వరకు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. డిసెంబరు 13న లోక్‌సభలో ఇద్దరు దుండగులు హల్‌చల్ చేసిన వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి నుంచి ప్రకటనను ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆ అంశంపై ఉభయ సభల్లో చర్చించాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్లతో నిరసన తెలిపిన 141 మంది ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ అయ్యారు. తాజాగా మంగళవారం 49 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈనేపథ్యంలో మంగళవారం రోజు పార్లమెంట్ హౌస్ మకర ద్వారం వద్ద విపక్ష ఎంపీలు కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధ‌న్‌కర్‌ను అనుకరించారు.