ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు ఆయన తెలిపారు. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ‘గగన్యాన్’ పేరిట భారత్ ప్రతిష్ఠాత్మక మిషన్ను చేపడుతున్న విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో గగన్యాన్లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను ధ్రువీకరించేందుకు మరో ప్రయోగం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.