300 Years Life : ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 200 ఏళ్ల నుంచి 300 ఏళ్లపాటు మనిషి జీవించే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన పేర్కొన్నారు. శరీరంలో పాడైపోయిన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా దీన్ని సాధించవచ్చని ఆయన చెప్పారు. జేఎన్టీయూ హైదరాబాద్ 12వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఇస్రో అధిపతి ఈ కామెంట్స్(300 Years Life) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
తుఫానులు, భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడ? వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలను కక్ష్యలోకి పంపుతున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే ‘గగన్యాన్ మిషన్’ను ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానాన్ని పెంచుకొని అత్యాధునిక రోబోలను తయారుచేస్తే అంగారక, శుక్రగ్రహాలపై ఇస్రో చేపట్టే ప్రయోగాల్లో వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.
‘‘నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అన్నీ విజయాలే సాధించానని అనుకోవద్దు. నేను కూడా ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిలయ్యాను’’ అని విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ అన్నారు. తన ఫెయిల్యూర్స్ గురించి కూడా ఆయన వివరించారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదురయ్యే అపజయాలే విజయానికి నిజమైన సోపానాలని తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రశంసలు వెల్లువెత్తాయని.. అంతకుముందు రెండుసార్లు విఫలమైన విషయాన్ని అంతా మర్చిపోయారని గుర్తు చేశారు. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో తాను కూడా తప్పులు చేశానని చెప్పుకొచ్చారు.
2023లో భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను సాధించింది. 2024లో తొలి రోజునే ఎక్స్పోశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి, శుభారంభం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారం తిరక్కుండానే మరో మైలురాయిని చేరుకోనుంది. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తన నిర్దిష్ట గమ్య స్థానాన్ని చేరుకోనుంది. ఈ విజయంతో సూర్యుడి మీద పరిశోధనలకు ప్రోబ్లను పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడి గురించి పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1తో ఇస్రో వాటి సరసన నిలిచింది. సూర్యుడి మీద పరిశోధనల కోసం 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో ఆదిత్య L1ను ప్రయోగించింది. ఇస్రో ప్రయోగించిన ఈ ఆదిత్య L1 మిషన్ చంద్రయాన్-3 మాదిరిగానే భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపహేళిని పెంచుకుని సూర్యుడి దిశగా సుదీర్ఘంగా ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గరకు చేరుకుంది. 2024 జనవరి 6 సాయంత్రం లెగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలోకి ప్రవేశించనున్నట్లు ఇస్రో తెలిపింది.