High Alert: ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద హైఅలర్ట్…!!

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 11:58 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రతతో ….అధికార యంత్రాంగం ఢిల్లీపై నిఘా పెట్టింది. గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యలయం వద్ద పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతుదారుల నుంచి మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశముందన్న సమాచారంతో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద హై అలర్ట్ విధించారు.

గతేడాది జనవరిలో గణతంత్రదినోత్సవ బీటింగ్ రీట్రిట్ కు కూతవేటు దూరంలోనే ఈ పేలుడు సంభవించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పూలకుండిలో ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లు తెలిపారు. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీగా భద్రతను పెంచారు. వీటితో పాటు ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద కూడా భారీ భద్రతను పెంచారు. అయితే మరోసారి ఇరాన్ మద్దతుదారులచే ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో భద్రతతను మరింత కట్టుదిట్టం చేశారు.