NIA : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. భారత్లో గూఢచర్యానికి పాల్పడేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాల్లో రైడ్స్ చేసినట్లు సమాచారం. భారత రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసేందుకు ప్రయత్నించారనే అనుమానం ఉన్న వారిని ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా రాష్ట్రాలలోని 16 చోట్ల ఈ రైడ్స్ జరిగాయని సమాచారం. ఈ రైడ్స్లో 22 మొబైల్ ఫోన్లు, కీలక సమాచారం ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Also Read :Mamata Banerjee : ప్రధాని మోడీకి వార్నింగ్ వ్యాఖ్యలు.. సీఎం దీదీపై పోలీసులకు ఫిర్యాదు
2020 సంవత్సరంలో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో గూఢచర్యం కేసు ఒకటి బయటపడింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుజరాత్లోని పంచ్మహల్కు చెందిన ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీపై అప్పట్లో అభియోగాలు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయగా విశాఖలో తూర్పు నౌకాదళానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకు ఇచ్చేందుకు నౌకాదళానికి చెందిన పది మంది సిబ్బంది లంచాలు తీసుకున్నారని వెల్లడైంది. కీలక నిందితుడు ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీకి ఈ సమాచారాన్ని అందించినట్లు తెలిసింది. అతడి నుంచి ఆ సమాచారమంతా పాకిస్తాన్కు చేరిందని ఎన్ఐఏ భావిస్తోంది. ఇమ్రాన్ తరచుగా పాకిస్తాన్కు వెళ్లేవాడని, ఐఎస్ఐ ఏజెంట్లతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. పాకిస్తాన్కు ఇమ్రాన్ యూసుఫ్ చేరవేసిన సమాచారంలో భారత నౌకలు, జలాంతర్గాములు, ఇతర రక్షణ స్ధావరాల చిట్టా ఉందని తెలుస్తోంది.
తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్ను పాక్ సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఈ-ఇమ్తియాజ్’ను లీ జియామింగ్కు అందజేసింది. ఈ పురస్కారం జనరల్ లీ జియోమింగ్ నాలుగు దశాబ్దాల కెరీర్కు ఇది తగిన గుర్తింపులాంటిదని పాక్ ప్రభుత్వం తెలిపింది. చైనా మిలిటరీకి అతను చేసిన గణనీయమైన సహకారం మరువలేనిదని పేర్కొంది. కాగా, గతంలో ఈ గౌరవాన్ని భారత్కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు.