Iran Attack : మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక యుద్ధ భూమిలోకి ఇరాన్ కూడా దిగింది. గాజాపై అమానవీయంగా గత 100 రోజులుగా దాడులు(Iran Attack) చేస్తున్న ఇజ్రాయెల్ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల హిందూ మహాసముద్రంలో రెండు ఇజ్రాయెలీ నౌకలపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరానే ఉందంటూ లెబనాన్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ అల్ మాయదీన్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ మీడియా సంస్థ లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు అనుకూలంగా పనిచేస్తుంటుంది. హిజ్బుల్లాకు ఆయుధాలు, నిధులు ఇరాన్ నుంచే అందుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యూహాత్మకంగానే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారత్లోని గుజరాత్ తీరం సమీపంలో ఒక ఇజ్రాయెలీ నౌకపై దాడి జరిగిన టైంలో .. అది ఇరాన్ పనేనని అమెరికా చెప్పింది. ఆ మాటే నిజమని ఇప్పుడు అల్ మాయదీన్ కథనంతో నిర్ధారణ అయింది. లెబనాన్, సిరియాలలో ఇరాన్ సైనిక అధికారులు, హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ ఇటీవల హతమార్చింది. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయెలీ నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని ఈ కథనంలో ప్రస్తావించారు. లెబనాన్ రాజధాని బీరుట్లో హమాస్ అగ్రనేత సలేహ్ అల్ అరూరి, సిరియాలో ఇరాన్ కమాండర్ రజీ మౌసవిలను ఇజ్రాయెలే చంపిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఆ హత్యలకు తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లోనే ఇరాన్ అనౌన్స్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఇరాన్, పాక్ మధ్య కూడా ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. తొలుత పాక్లోని ఒక ఉగ్రస్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఒక రోజు తర్వాత.. ఇరాన్లోని ఒక ఉగ్ర స్థావరంపై పాక్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఇరాన్ గగనతల రక్షణకు సంబంధించిన ఆర్మీ డ్రిల్స్ చేస్తోంది. ఈ ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్ ఎందుకోసం ? పాక్తో యుద్ధం చేసేందుకా ? ఇజ్రాయెల్తో యుద్ధం చేసేందుకా ? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఇరాన్ అత్యుత్సాహంతో ఇటీవల ఇరాక్లోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్ స్థావరాలపైకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వేసింది. దాదాపు 1250 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను మిస్సైల్స్తో ఇరాన్ ఛేదించింది. ఏ రకంగా చూసుకున్నా ఎర్ర సముద్రంలో హౌతీల ఎటాక్తో ఏర్పడిన యుద్ధ మేఘాలు.. ఇప్పుడు హిందూ సముద్రానికి కూడా పాకాయని పరిశీలకులు అంటున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే.. ఈ యుద్ధ మేఘాలు తొలగిపోతాయి. ఆ దిశగా అమెరికా చొరవ చూపాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. మరోవైపు భారత్ కూడా హిందూ మహాసముద్రంలో అలర్ట్ అయింది. దేశంలోని తీర ప్రాంతాలకు వచ్చే వాణిజ్య నౌకలకు యుద్ధ నౌకలతో గట్టి పహారాను అందిస్తోంది.