Manipur Update : మణిపూర్ లో ఇంటర్నెట్ సర్వీసులు షురూ.. శాంతి నెలకొన్నట్టేనా ?

Manipur Update : దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మణిపూర్ లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 01:37 PM IST

Manipur Update : దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మణిపూర్ లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు మొదలయ్యాయి. ఈవిషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ శనివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంచారానికి సంబంధించిన ఆంక్షల్ని కూడా ఇప్పటికే కొంతమేర సడలించింది. వాస్తవానికి మణిపూర్ లోని  చాలాచోట్ల పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది.  మే 3న మొదలైన అల్లర్లు అక్కడక్కడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మైతై, కుకీ తెగల మధ్య దాడులు, ప్రతిదాడులతో కొన్ని ఏరియాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని తెలుస్తోంది.  మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఈనెల 22న  అర్ధరాత్రి భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ వర్గానికి చెందిన ఐదుగురు వాలంటీర్లను అరెస్ట్ చేసినందుకు ఆందోళనకారులు ఆ రోజున పెద్దఎత్తున గొడవకు దిగారు. కొంతమందిని పాత కేసుల నెపంతో పదేపదే అరెస్టు చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తుండగా.. ఈ ఆరోపణల్ని భద్రతా బలగాలు మాత్రం కొట్టి పారేస్తున్నాయి.

Also read : Jagan Bail anniversary : న్యాయ‌దేవ‌త‌కు గంత‌లు! జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ కు ప‌దేళ్లు..!!

ఇక మణిపూర్ లో మహిళలపై జరిగిన 11 అఘాయిత్యాల కేసులను ఇప్పటికే సీబీఐకి బదిలీ చేశారు. వాటిపై సీబీఐ విచారణ జరుపుతోంది. అయితే ఈ దర్యాప్తు ప్రక్రియ నత్తనడకన (Manipur Update) సాగుతోంది. మణి పూర్‌ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కేంద్ర సర్కారు ఓ స్పెషల్ ఆర్మీ ఆఫీసర్‌ని రంగంలోకి దింపింది. 2015లో మయన్మార్‌లో సర్జికల్ స్ట్రైక్‌ని లీడ్ చేసిన రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ని మణిపూర్‌ సమస్యను హ్యాండిల్ చేసేందుకు నియమించింది. ఆగస్టు 24న మణిపూర్ ప్రభుత్వం రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెంబంను  మణిపూర్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.