Lalu – Indira Gandhi : 1975 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై బీజేపీ రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పట్లో ఎమర్జెన్సీ ఆర్డర్స్ను ఎదిరించిన వారిని మాత్రమే ఇందిరాగాంధీ జైలులో పెట్టించారు. అయితే జైలులో పెట్టించిన వారిని వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడలేదు. వారిని తిట్టిపోసుకోలేదు’’ అని లాలూ చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలం నాటి స్థితిగతులను అద్దంపట్టేలా జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన ‘‘ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975’’ అనే కథనాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా లాలూ షేర్ చేశారు. ఆ కథనంలోనే లాలూ అభిప్రాయాలను, ఆనాటి అనుభవాలను పొందుపరిచారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్గా వ్యవహరించాను.భద్రతా చట్టం (మిసా) కింద నన్ను 15 ఏళ్లకుపైగా జైలులో పెట్టారు. ఈ రోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న చాలా మంది బీజేపీ మంత్రులకు ఈ విషయం తెలియదు’’ అని లాలూ తెలిపారు. ‘‘నేను, నా సహచరులు ఎవరూ మోడీ, నడ్డా సహా బీజేపీ మంత్రులెవరి పేర్లను ఆ ఉద్యమం టైంలో వినలేదు. కానీ, ఈ రోజు మాత్రం వారు స్వాతంత్య్రం గురించి ఉపన్యాసాలు దంచికొడుతున్నారు’’ అని లాలూ చెప్పారు.
‘‘ఆనాడు మమ్మల్ని ఇందిరాగాంధీ జైలులో పెట్టించారే కానీ దేశ వ్యతిరేకులు అని.. దేశభక్తి లేనివారు అని పిలవలేదు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇందిరా గాంధీ పోరాడారు’’ అని లాలూ అభిప్రాయపడ్డారు. కాగా, 1975 సంవత్సరం జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని దేశంలో విధించారు. ఆనాడు విధించిన ఎమర్జెన్సీకి 2024 సంవత్సరం జూన్ నాటికి 50 ఏళ్లు నిండాయి.