India Population: 41 కోట్లు తగ్గిపోనున్న ఇండియా జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు డౌన్!!

ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు 141 కోట్లు.. 2100 నాటికి ఇది 100 కోట్లకు పడిపోతుందట!!

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 08:15 AM IST

ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు 141 కోట్లు.. 2100 నాటికి ఇది 100 కోట్లకు పడిపోతుందట!!
రాబోయే 78 ఏళ్లలో మన జనాభా ఏకంగా 41 కోట్లు తగ్గిపోతుందట!!
అమెరికాలోని స్టాన్‪‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈవిషయాన్ని ప్రస్తావించారు.

ఎందుకు తగ్గుతుంది?

అధ్యయన నివేదిక ప్రకారం.. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు వనరులు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అంతిమంగా జనాభా తగ్గుదల మొదలవుతుంది.సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా జనాభా తగ్గుదలకు కారణమవుతుంది. మన దేశంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.76గా ఉండగా, 2032 సంవత్సరం నాటికి 1.39, 2052 నాటికి 1.28, 2082 నాటికి 1.2, 2100 సంవత్సరం నాటికి 1.19గా ఉండే అవకాశం ఉంది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలోనూ వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం.

జనసాంద్రత కూడా డౌన్..

రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని నివేదిక చెప్పింది.జనాభా విషయంలో భారత్, చైనా ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది.
జనాభాలో మనం చైనా తర్వాత ఉన్నప్పటికీ.. జన సాంద్రతలో మాత్రం మనమే ముందున్నాం. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే.  2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది.
2100 నాటికి మన దేశంలో చదరపు కిలోమీటరుకు 335 మంది జీవిస్తే, చైనాలో 51 మందే జీవిస్తారు. చదరపు కిలోమీటరుకు అమెరికాలో ప్రస్తుతం సగటున 37 మంది జీవిస్తే, 2100కల్లా 31 మంది నివసిస్తారు.జపాన్‌లో ప్రస్తుతం 329 మంది జీవిస్తే, 2100 నాటికి 133 మంది మాత్రమే జీవిస్తారు. అంటే మన దేశంతోపాటు అన్ని దేశాల్లోనూ జనాభా, జన సాంద్రత విపరీతంగా తగ్గుతుంది.