భారతీయ మహిళ మనస్తత్వంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వ్యాఖ్యలు చేసింది. భర్తల పట్ల సంకుచితంగా ఆలోచిస్తారని పేర్కొంది. పూర్తిగా భర్తలు తమ సొంతమనే భావన కలిగి ఉంటారని ఒక మహిళ ఆత్మహత్య కేసును విచారించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. అలహాబాద్ హైకోర్టు సోమవారం ఒక పిటిషన్ను కొట్టివేస్తూ తన పరిశీలనలలో, వివాహిత స్త్రీ తన భర్త పట్ల చాలా పొససివ్గా ఉంటుందని. అతనిని ఇతరులతో పంచుకోవడాన్ని సహించదని పేర్కొంది.
తన భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన డిశ్చార్జి దరఖాస్తును కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ రాహుల్ చతుర్వేదితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు సుశీల్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్నాడని, అతని భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కారణమని కోర్టు పేర్కొంది. మరొక స్త్రీని రహస్యంగా వివాహం చేసుకోవడం కారణంగా మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని కోర్టు అభిప్రాయపడింది. పెళ్లయిన ఏ స్త్రీకైనా తన భర్తను మరొక స్త్రీ పంచుకోవడం లేదా అతను మరొక స్త్రీని వివాహం చేసుకోబోతున్నాడనేది అతిపెద్ద కుదుపు. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో, వారి నుండి ఎటువంటి చిత్తశుద్ధిని ఆశించడం అసాధ్యం. ఈ కేసులో కూడా సరిగ్గా అదే జరిగింది” అని ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది.
భర్త సుశీల్ కుమార్ మరియు అతని ఆరుగురు కుటుంబ సభ్యులపై IPCలోని పలు సెక్షన్ల కింద వారణాసిలోని మాండూడిహ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. జీవిత భాగస్వామి జీవితకాలంలో స్వచ్ఛందంగా గాయపరచడం, నేరపూరితంగా బెదిరించడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటి అభియోగాలు ఇందులో ఉన్నాయి. తన భర్తకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని రహస్యంగా మూడోసారి పెళ్లి చేసుకున్నాడని భార్య ఆరోపించింది. తన భర్త, అత్తమామలు తనపై దాడి చేసి విడాకుల కోసం మానసికంగా హింసించారని కూడా పేర్కొంది.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆ మహిళ విషం తాగి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు విచారణ ప్రారంభించి భర్త, అతని కుటుంబ సభ్యులపై చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులు మొదట ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు, అది తిరస్కరించబడింది. దీంతో వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నిందితులను విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు వారి పిటిషన్ను కొట్టివేసింది. ఆ సందర్భంగా భర్తలపై భారతీయ మహిళల మనోభావాలపై సంచటన వ్యాఖ్యలు చేసింది.