Fiji Deputy PM : అయోధ్య రామయ్యను తొలిసారిగా ఓ విదేశీ నేత దర్శించుకోనున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ ఈ నెల 8న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు విచ్చేయనున్నారు. ఈవిషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘‘అధికారిక పర్యటన నిమిత్తం ఫిజీ డిప్యూటీ పీఎం బిమన్ ప్రసాద్ ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం. బిమన్ పర్యటన భారత్-ఫిజీ సంబంధాలను బలోపేతం చేస్తుంది’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. బిమన్ ప్రసాద్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న బిమన్కు(Fiji Deputy PM) విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ పరిమిత త్రిపాఠి స్వాగతం పలికారు.
We’re now on WhatsApp. Click to Join
బిమన్ ఈనెల 10వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఇవాళ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాలు, విద్యా శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్తో బిమన్ భేటీ కానున్నారు. ఈక్రమంలోనే ఈనెల 8న అయోధ్యను సందర్శిస్తారు. అయోధ్య రామమందిరంలో జనవరి 22న భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నాయకుడు బిమన్ ప్రసాదే. ప్రస్తుతం ఆయన ఫిజీ దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రణాళిక, జాతీయ అభివృద్ధి, గణాంకాల మంత్రిగా పనిచేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలోనూ భారతదేశాన్ని బిమన్ ప్రసాద్ సందర్శించారు. అప్పటి పర్యటనలో ‘’సుస్థిరమైన, డీకార్బనైజ్డ్ భవిష్యత్ కోసం వ్యూహాలు’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇదే బిమన్ ప్రసాద్కు మొదటి అధికారిక పర్యటన.
ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర ప్రారంభాన్ని ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. అయితే, ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంతకాలం పాటు నిర్మాణ పనులు నిలిపివేశారు. తాజాగా.. మళ్లీ ఆలయ నిర్మాణ పనులు పున:ప్రారంభించారు. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్సహా రెండో అంతస్తు పనులు వెంటనే మొదలుకానున్నాయి.ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, మందిరంలో కొలువుదీరని బాలరాముడిని దర్శనం కోసం రోజూ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రారంభోత్సవం నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.