Gold Medal To Indian Army : భారత సైన్యానికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ పోటీలో తెలుసా ? బ్రిటన్ లోని వేల్స్లో జరిగిన ‘కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్’లో !! ఇదొక ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇందులో భారత ఆర్మీకి చెందిన గూర్ఖా రైఫిల్స్ టీమ్ సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక సైనిక దళాలు, ప్రతిష్ఠాత్మక రెజిమెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా దేశాల జట్లతో జరిగిన పోటీల్లో గెలిచి భారత్ కు గూర్ఖా రైఫిల్స్ టీమ్ గోల్డ్ మెడల్ ను సాధించి పెట్టింది. వేల్స్లోని పర్వతాలు, చిత్తడి నేలల్లో వ్యూహాత్మక సైనిక కార్యకలాపాల విభాగంలో ఈ పోటీలు జరిగాయి.
ప్రతి సంవత్సరం బ్రిటీష్ సైన్యం ‘కేంబ్రియన్ పెట్రోల్’ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలను 1959 సంవత్సరం నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8 రౌండ్ల పోటీలను నిర్వహిస్తారు. ఒక్కో రౌండ్ లో పోటీలు 48 గంటల పాటు కొనసాగుతాయి.మొత్తం 10 రోజుల పాటు (అక్టోబర్ 6 నుంచి 15 వరకు) పోటీలు జరిగాయి. పోటీపడే టీమ్స్ కు వ్యక్తిగత కిట్, పరికరాలు, దాదాపు 50 పౌండ్లు బరువున్న ఆయుధాలను అందిస్తారు. వాటితో పెట్రోలింగ్ చేస్తూ.. సైనిక వ్యాయామాలు చేయడమే ఈ పోటీలోని ప్రధాన అంశం. ఈక్రమంలో కొండలు, గుట్టలపైకి సగటున 1000 మీటర్ల దాకా ఎక్కి దిగాల్సి ఉంటుంది. పోటీలు జరిగే క్రమంలో రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టీమ్స్ ఈ అభ్యాసాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇందులో అత్యుత్తమ పనితీరును కనబర్చినందు వల్లే భారత్ కు గోల్డ్ మెడల్ (Gold Medal To Indian Army) వచ్చింది.