India Vs Pakistan : పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో అవి హల్చల్ చేశాయి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో మెంధార్లోని బల్నోయి ప్రాంతంలోకి రెండు పాక్ డ్రోన్లు చొరబడ్డాయి. దీంతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పహారా కాస్తున్నసైనిక దళాలు డ్రోన్లపైకి కాల్పులు జరిపాయి. మరోవైపు గుల్పూర్ సెక్టార్ వద్ద కూడా ఇంకో రెండు పాక్ డ్రోన్లు సంచరించాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బాల్నోయ్-మెంధార్, గుల్పూర్ సెక్టార్లలోకి ప్రవేశించిన పాక్ డ్రోన్లు సైనికుల కాల్పుల తర్వాత వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. ఆ వెంటనే భద్రతా బలగాలు ఆయా ఏరియాల్లో సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టాయి. డ్రగ్స్, ఆయుధాలను అక్రమంగా సప్లై చేయడానికి ఈ డ్రోన్లను పాక్ ఆర్మీ వాడుతోందని భారత నిఘా వర్గాలు(India Vs Pakistan) అంచనా వేస్తున్నాయి. ఇంతకుముందు ఈ నెల12న కూడా కశ్మీర్లోని మెంధార్ సెక్టార్లో ఉన్న మాన్కోట్ ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ ఒకటి ఇదేవిధంగా చక్కర్లు కొట్టింది. దీంతో దానిపైకి భారత ఆర్మీ ఫైరింగ్ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారత భద్రతా బలగాల దృష్టిని మరల్చేందుకు కూడా ఈవిధంగా డ్రోన్లను పంపుతున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
గురువారం రోజు పూంచ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో భారత సైన్యం అలర్ట్ అయింది. జమ్మూ కశ్మీర్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఫైర్ ఆక్సిడెంట్ చోటుచేసుకున్న ప్రదేశం సమీపంలో ఎటువంటి అనుమానాస్పద కదలికలు లేవని భద్రతా దళాలు గుర్తించాయి. కశ్మీర్లో ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణాపై సమాచారం అందించే వారికి రూ.3లక్షల నగదు బహుమతిని అందిస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన హెరాన్ మార్క్–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్ సరిహద్దు స్థావరాల్లో భారత్ గత ఏడాదే మోహరించింది. హెరన్ మార్క్–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవు. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం వీటి సొంతం. సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ వీటిలో ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్ మార్క్–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు.