Global Peace Summit : ఉక్రెయిన్, రష్యా దేశాలు గత రెండేళ్లుగా యుద్ధంలో తలపడుతున్నాయి. వాటి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే లక్ష్యంతో ఈనెల 15, 16 తేదీల్లో స్విట్జర్లాండ్ వేదికగా ప్రపంచ శాంతి సదస్సు జరగబోతోంది. స్విట్జర్లాండ్లోని లూసర్న్ సరస్సు పైన ఉన్న బర్గెన్స్టాక్ హోటల్ వేదికగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు తాము సిద్ధమని భారత్ ప్రకటించింది. ఈమేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ దాదాపు 160కిపైగా దేశాలను స్విస్ విదేశీ వ్యవహారాల శాఖ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరవుతామని దాదాపు 107 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఇప్పటివరకు ప్రకటించాయి. ఈ జాబితాలో ఇప్పుడు భారత్(Global Peace Summit) కూడా చేరింది.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల ఈ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఫోన్ చేసి సంభాషించారు. ‘‘రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం తప్పకుండా మద్దతు ఇస్తాం. దీని కోసం మావంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తాం’’ అని ఆ సందర్భంగా జెలెన్స్కీకి మోడీ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొంటామని చెప్పారు. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే భారత ప్రధాని మోడీకి జెలెన్స్కీ ఫోన్ కాల్ చేసి అభినందించారు. ‘‘భారత్లో కొత్త ప్రభుత్వం త్వరగా ఏర్పడాలి. త్వరలో జరగబోయే ప్రపంచ శాంతి సదస్సు గురించి చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాలి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ప్రయత్నించాలి. అనుకూల సమయం చూసుకొని భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్లో పర్యటించాలి’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
2022 అక్టోబరులో జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోడీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిశారు. రష్యా ఎదుట 10 పాయింట్ల శాంతి సూత్రాన్ని ఉంచాలని ఆయన కోరారు. ఈవిషయంలో తమకు సహకరించాలన్నారు. ఈ శాంతి సూత్రం యొక్క లక్ష్యం ఉక్రెయిన్లో శాశ్వత శాంతిని తీసుకురావడం, యుద్ధానికి ముగింపు పలకడమేనని అప్పట్లో మోడీతో జెలెన్స్కీ చెప్పారు. గత ఏడాది ఆగస్టులోనూ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై సౌదీ అరేబియా ఒక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. అందులో 40 దేశాలు పాల్గొన్నాయి.