PM Modi: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మూడవసారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రసంగించిన ప్రధాని ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో 1,000 ఆధునిక విశ్రాంతి గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు.
“మా ప్రభుత్వం మూడవ దఫాలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటం ఖాయం” అని ఆయన అన్నారు. 2014 నుండి దేశంలో 21 కోట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల క్రితం, సుమారు 2,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి. ఇప్పుడు 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. గత 10 ఏళ్లలో ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి కూడా మోడీ మాట్లాడారు.
“మేము సముద్రాలు, పర్వతాలను సవాలు చేస్తున్నా. రికార్డు సమయంలో ఇంజనీరింగ్ అద్భుతాలను నిర్మిస్తున్నాము. అటల్ టన్నెల్ నుండి అటల్ సేతు వరకు, భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత 10 ఏళ్లలో 75 కొత్త విమానాశ్రయాలను నిర్మించారు. దాదాపు 4 లక్షల గ్రామీణ రహదారులు నిర్మించామని చెప్పారు. స్థానికంగా లభించే ముడి పదార్థాలను ఉపయోగించి బ్యాటరీలను తయారు చేసేందుకు పరిశోధన మరియు అభివృద్ధి (R&D)ని కొనసాగించాలని పరిశ్రమను ప్రోత్సహించారు.