భారత్ లో పెరుగుతున్న పేదరికంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సంపన్న దేశంగా ఎదిగింది. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు మాత్రం పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణతో బాధపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ధనిక, పేదల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని తొలగించాలన్నారు.
నాగ్ పూర్ లో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు అనుబంధంగా ఉన్న మరో సంస్థ భారత్ వికాస్ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, సంపన్న దేశంగా ఉన్నప్పటికీ, దాని జనాభా పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నదని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ సమయంలో సమాజంలో సామాజిక, ఆర్థిక సమానత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఈ రెండు వర్గాల మధ్య అంతరం పెరిగింది. సామాజిక అసమానతలాగే ఆర్థిక అసమానత కూడా పెరిగింది. ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పని చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడానికి,ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. దేశంలోని 124 జిల్లాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.