Drone : రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్రం గట్టిగా స్పందిస్తోంది. తాజాగా, బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన మూడు కాంట్రాక్టులను రద్దు చేసింది. సాయుధ దళాల రవాణా అవసరాల కోసం మొత్తం 400 డ్రోన్లను తయారు చేయాల్సిన ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. తాజాగా రద్దు చేసిన కాంట్రాక్టులో 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.230 కోట్లు. 2023లో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది.
Read Also: Harshit Rana: రోహిత్ సలహా ఫలించింది.. రాణా కామెంట్స్ వైరల్!
ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనా సరిహద్దు వెంట, 3,488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖపై మోహరించనున్నారు. అయితే, కొన్ని భారతీయ కంపెనీలు డ్రోన్ల తయారీ కోసం చైనా నుంచి విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇది సైబర్ భద్రత, డేటా రక్షణకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని రక్షణ శాఖ వర్గాలు హెచ్చరించాయి. అంతేకాకుండా, శత్రువులకు గోప్యతను దెబ్బతీసే అవకాశం కలిగించే వీలును కల్పిస్తోంది. వారు జూమింగ్ టెక్నాలజీ ద్వారా మన డ్రోన్లను నియంత్రించగలిగే అవకాశం ఉంది. అంతేకాక..ఇంకా, చైనా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ‘బ్యాక్డోర్’ సాఫ్ట్వేర్ ఉండే అవకాశమూ ఉంది.. దాంతో మన భద్రతా వ్యవస్థల్ని మోసగించగలరు.
గతేడాది ఆగస్టులో రాజౌరీ సెక్టార్లో మోహరించిన ఇన్ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించగా అవి దారి మళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలాయి. ఆ ఘటనపై దర్యాప్తు చేయగా.. దానిలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రక్షణశాఖ, సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్పై దృష్టిసారించింది. దీనికితోడు ఫిక్కీ, సీఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిఘా, పహారా తదితర మిషన్ల సమయంలో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో.. అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
Read Also: Maharashtra : మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు : రాహుల్ గాంధీ