INDIA Vs NDA : ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బలమైన పోటీ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 లోక్సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ సంఖ్య దాదాపు 94 స్థానాలకు చేరింది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి గత ఎన్నికల్లో 91 లోక్సభ స్థానాలు రాగా.. ఈసారి ఆ స్థానాల సంఖ్య మరో 140 పెరిగి 230 దాటింది. ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి దేశంలో సగటున ఎన్డీయే కూటమికి 44 శాతం ఓట్లు రాగా, ఇండియా కూటమికి 41 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఓట్ల శాతాలు మారే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి(INDIA Vs NDA) లోక్సభ సీట్లు ఏయే రాష్ట్రాల్లో పెరిగాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- గత ఎన్నికల్లో బీజేపీకి 308 లోక్సభ సీట్లు రాగా ఈసారి అది 243కే పరిమితమైంది. అంటే బీజేపీ దాదాపు 65 సీట్లను కోల్పోయింది.
- ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లో ఎన్డీఏకు ఊహించని దెబ్బ తగిలింది.
- ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ చాలా బలపడింది.
- అయోధ్య రామమందిరం అంశం కూడా ఈసారి యూపీలో బీజేపీకి లబ్ధి చేకూర్చలేక పోయింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ఓడిపోయింది.
- ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లకుగానూ 44 చోట్ల ఇండియా కూటమి గెలిచింది. వీటిలో 30కిపైగా సీట్లు ఒక్క సమాజ్ వాదీ పార్టీయే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 7 చోట్ల విజయం సాధించింది.
- మహారాష్ట్రలో 18, రాజస్థాన్లో 10, కర్ణాటకలో 8, బిహార్లో 5, గుజరాత్లో 2, జార్ఖండ్లో 2 చొప్పున లోక్సభ సీట్లను ఈసారి బీజేపీ కోల్పోయింది. అవన్నీ ఇండియా కూటమి పార్టీల ఖాతాలోకి చేరాయి.
- ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా కాంగ్రెస్, సమాజ్వాదీ కాంబినేషన్ వర్కవుట్ అయింది. యాదవ్-ముస్లిం ఓటు బ్యాంకు కలిసొచ్చింది.
- పశ్చిమబెంగాల్లో గత ఎన్నికల్లో 18 లోక్సభ సీట్లను బీజేపీ గెలవగా.. ఈసారి కమలదళం 11 సీట్లకే పరిమితమైంది.