అసోంలోని జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వాయుసేనకు చెందిన ఈ కార్గో విమానం జోర్హాట్లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన రౌరియా ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. విమానంలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారన్న వివరాలు కూడా తెలియరాలేదు.
ఈ ఘటనపై భారత వాయుసేన స్పందించింది. సరుకుల రవాణాకు ఉపయోగించే AN-32 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ఈశాన్య భారత్లో కీలక వాయుసేన స్థావరంగా ఉన్న జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ ప్రాంతీయ వైమానిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
కొన్ని నెలల క్రితం కూడా జోర్హాట్ ఎయిర్బేస్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం సాధారణ శిక్షణ సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం AN-32 ప్రమాదంపై మరిన్ని వివరాల కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
