Site icon HashtagU Telugu

Tihar Jail Warden : నోయిడా కేంద్రంగా తిహార్ జైలు వార్డెన్ డ్రగ్స్ దందా

Tihar Jail Warden Meth Lab Greater Noida

Tihar Jail Warden : డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా మన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో  మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ను ఘన, ద్రవ రూపంలో తయారు చేస్తున్నారు. దీన్ని తయారు చేయిస్తున్నది ఎవరు ? అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీలోని తిహార్ జైలులో పనిచేసే ఒక వార్డెన్, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి, మెక్సికోకు చెందిన డ్రగ్స్ ముఠా సభ్యులు కలిసి మెథాంఫెటమైన్‌‌ను తయారు చేయిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంయుక్త విచారణలో వెల్లడైంది.  గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఉన్న కసానా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేయించారని గుర్తించారు.

Also Read :Clash In Court : కోర్టులో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్

వాస్తవానికి అక్టోబరు 25నే  ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. అప్పట్లో దాదాపు 95 కిలోల మెథాంఫెటమైన్‌ను ఘన, ద్రవ రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.తాజాగా అందులోని ప్రధాన సూత్రధారుల(Tihar Jail Warden) వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దేశంలోనే అతిపెద్దదైన తిహార్ జైలులో పనిచేసే ఒక వార్డెన్ ఈ ముఠాలో ఎందుకు ఉన్నాడు ? మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ను తయారు చేయించి అతడు ఏం చేసేవాడు ? అనేది విచారణలో తెలియాల్సి ఉంది.

Also Read :Jio Payment : ‘జియో’ మరో కొత్త వ్యాపారం.. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ అగ్రిగేటర్‌గా లైసెన్స్

ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన అంశం ఉంది. అదేమిటంటే.. మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తయారీ ముఠాలోని ఢిల్లీ వ్యాపారిని గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ (డీఆర్ఐ) అరెస్టు చేసింది. అతడిని తిహార్ జైలుకు పంపగా.. అక్కడే వార్డెన్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడే ఢిల్లీ వ్యాపారి చెప్పుడు మాటలు విని.. డ్రగ్స్ తయారీ ముఠాలో తిహార్ జైలు వార్డెన్ చేరాడని గుర్తించారు. ఈక్రమంలో వారిద్దరూ ముంబైకి చెందిన ఒక రసాయన శాస్త్రవేత్తను కలిశారు. అతడి సహకారంతో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తయారీకి సంబంధించిన ఫార్ములాను రెడీ చేయించుకున్నారు. ఆ ఫార్ములా ప్రకారం రెడీ చేసిన డ్రగ్‌ను ఢిల్లీలో నివసిస్తున్న మెక్సికన్ డ్రగ్స్ గ్యాంగుకు చెందిన ఒక సభ్యుడితో టెస్ట్ చేయించారని విచారణలో వెల్లడైంది.  విశ్వసనీయ సమాచారంతో అక్టోబరు 25న ఈ ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు, ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. వారిని అక్టోబరు 27 న మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితులను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.