Heavy Rains: దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు (Heavy Rains) విస్తృతంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) రానున్న రోజుల్లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేపటి నుంచి ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని IMD ప్రకటించింది. ఈ జాబితాలో ఒడిశా, అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయి.
వాతావరణ పరిస్థితుల విశ్లేషణ ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి మరింత విస్తృతంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతోనే తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తూర్పు తీర రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది.
Also Read: India XI vs UAE: ఆసియా కప్ 2025.. నేడు యూఏఈతో టీమిండియా మ్యాచ్, ప్లేయింగ్ 11 ఇదేనా?
వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ రాష్ట్రాల్లో వ్యవసాయ కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. రైతులు తమ పంటల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోనూ నీట మునిగే అవకాశాలు ఉన్నందున, ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయక చర్యలను సిద్ధం చేస్తున్నాయి. పౌరులు వాతావరణ శాఖ జారీ చేసే అప్డేట్లను నిరంతరం గమనిస్తూ ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని IMD కోరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం, రహదారులపై ప్రయాణానికి ఆటంకాలు వంటి సమస్యలు తలెత్తవచ్చని అంచనా. ఈ వర్షాల వల్ల ఈ 20 రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.