ఢిల్లీలో వరదలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా ట్రాఫిక్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యమునా నది నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ.. ITO, అక్షరధామ్ సహా అనేక ప్రాంతాలు వరదలతో నిండిపోవడంతో ఆదివారం ఢిల్లీలో పరిస్థితి క్లిష్టంగా ఉంది. వరదలు ట్రాఫిక్పై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా మథుర రోడ్లో, అపోలో ఆసుపత్రి, జసోలా మెట్రో స్టేషన్కు సమీపంలో నీటి ఎద్దడి కారణంగా సరితా విహార్ ఫ్లైఓవర్ సమీపంలో వాహనాల రద్దీ ఏర్పడింది. శనివారం 207.67 మీటర్లకు చేరిన యమునా నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 206.14 మీటర్లకు తగ్గింది. యమునా నది ఎగువ పరీవాహక ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా రాజధాని నగరం వరద పరిస్థితిని ఎదుర్కొంటోంది. హర్యానాలోని యమునానగర్లో ఉన్న హత్నికుండ్ బ్యారేజీ నుండి ప్రవాహం రేటు గత రెండు రోజులుగా క్రమంగా తగ్గుతుంది. అయితే యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి 205.33 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాలలో నివసించే
వారిని సురక్షిత ప్రాంతాల్లోకి, సహాయ కేంద్రాలకు తరలించారు. ఈరోజు (ఆదివారం) ఢిల్లీలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.