Bhole Baba : ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలోని రతిభాన్పుర్లో శివారాధన కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 116 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఘటనపై దర్యాప్తునకు యూపీ సర్కారు ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
హాథ్రస్లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముడిపడిన ఓ కీలక ప్రవచనకర్త పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన పేరే భోలే బాబా(Bhole Baba). భోలే బాబా అసలు పేరు నారాయణ్ సాకార్ హరి. కొంతమంది ఈయనను సాకార్ విశ్వ హరి అని కూడా పిలుస్తుంటారు. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన భోలే బాబా తొలుత వ్యవసాయం చేసేవారు. అయితే అందరితో మాత్రం.. తాను ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ ఇంటెలీజెన్స్ బ్యూరోలో పనిచేశానని భోలే బాబా చెప్పుకునేవారు. 26 ఏళ్ల క్రితమే జాబ్ను వదిలేసి, ఆధ్మాత్మిక ప్రవచన కర్తగా మారానని ఆయన అందరితో ప్రచారం చేయించుకునేవారు. తనకు ఎవరూ గురువులు లేరని.. సమాజహితం కోసమే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతున్నానని భోలే బాబా ప్రకటించుకున్నారట.
భోలే బాబా ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్తో పాటు హాథ్రస్ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ ప్రోగ్రామ్స్కు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలోనూ భోలే బాబా అనుచరులు ఉన్నారని చెబుతుంటారు. ఈయన కార్యక్రమాల నిర్వహణకు ఎంతోమంది వాలంటీర్లు నిత్యం అందుబాటులో ఉంటారు. తాజాగా హాథ్రస్ జిల్లాలోని ఫుల్రాయ్ గ్రామంలో ఆయన ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు ఒక్కసారిగా పోటీపడగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దాంతో ఊపిరాడక చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.