Murder : హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు(Murder) కోల్పోయారు. నఫే సింగ్ వెంట ఉన్న పార్టీ కార్యకర్త కూడా ఈ దాడిలో మరణించారు. ఈ ఘటనలో నఫే సింగ్ ప్రైవేట్గా నియమించుకున్న గన్మెన్లు గాయపడ్డారు. నఫే సింగ్ తన వాహనంలో ఝజ్జర్ జిల్లాలోని బహదూర్ఘర్ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు.. నఫే సింగ్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆ కారులోని మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join
ఆ నలుగురిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నఫే సింగ్తో పాటు పార్టీ కార్యకర్త ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం నాయకులకు కూడా భద్రతను కల్పించలేకపోతోందని విమర్శించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
నఫే సింగ్ రాఠీ ప్రాణాలకు ముప్పు ఉందని ముందే తెలిసినప్పటికీ.. భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా ఆరోపించారు. ‘‘తన ప్రాణాలకు ముప్పు ఉందని రాఠీ ఆరు నెలల క్రితమే లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయినా ఆయనకు ఎటువంటి భద్రత కల్పించలేదు’’ అని చెప్పారు. ‘‘ఈ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నఫే సింగ్ రాఠీ ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, డీజీపీ కూడా స్పందించలేదు. కనీస భద్రత కల్పించలేదు’’ అని అభయ్ చౌతాలా పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి, నిందితులను శిక్షించాలని చౌతాలా డిమాండ్ చేశారు.