గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. సౌరాష్ట్ర-కచ్ సహా దక్షిణ గుజరాత్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు క్యూ కట్టారు.
ఇక ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి సైకిల్ పై గ్యాస్ సిలిండర్ తో పోలింగ్ బూత్ కు వచ్చారు. ఈ వైనం ఓటర్లను ఆకట్టుకుంది. వంట గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువులు అన్నింటి ధరలు పెంచిందంటూ బీజేపీ సర్కారుపై పరేష్ మండిపడ్డారు.
ధరల పెంపుపై ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని, ఇది తమకు కలిసొస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈసారి గుజరాత్ లో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా, యువతకు ఉపాధి కోసం, నిత్యావసరాలు తక్కువ ధరలో కావాలంటే, రైతులకు రుణమాఫీ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని గుజరాత్ ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
#WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR
— ANI (@ANI) December 1, 2022