Gst Council: ఐదు శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేస్తున్నారా!

అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Gst Imresizer

Gst Imresizer

అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి వచ్చే జూన్ తో గడువు ముగుస్తుంది. అందుకే ఇకపై ఇలాంటి నిధుల కోసం రాష్ట్రాలు, కేంద్రంపై ఆధారపడకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈమేరకు 5 శాతం శ్లాబును రెండు భాగాలుగా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉన్నాయి. అయితే ఐదు శాతం శ్లాబును ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

నిజానికి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే నిత్యావసరాల వస్తువులన్నీ ఈ శ్లాబు కిందే ఉంటాయి. అందుకే సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో కొన్నింటిని 3 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే ఛాన్సుంది. మరికొన్నింటిని 8 శాతం శ్లాబులో చేర్చే ఛాన్సుంది. ఇప్పటివరకు ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ఆహార, డైరీ ఉత్పత్తులపై జీఎస్టీ లేదు. వీటితోపాటు మరికొన్ని వస్తువులపైనా జీఎస్టీని విధించడం లేదు. అయితే ఇలాంటివాటిలో కొన్నింటిని మూడు శాతం పన్ను శ్లాబులో చేర్చే అవకాశం ఉంది. అలాగే ఐదు శాతం శ్లాబుని 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ మార్పులుకాని జరిగితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇప్పుడున్న జీఎస్టీ లెక్కలను బట్టి చూస్తే.. అతి తక్కువ ఉన్న పన్ను శ్లాబును ఒక శాతం పెంచితే.. ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఐదు శాతం శ్లాబుని కాని 8 శాతానికి పెంచితే.. ప్రభుత్వానికి ప్రతీ సంవత్సరం అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా శ్లాబుని మార్చే అవకాశమే ఉందంటున్నాయి మార్కె్ట్ వర్గాలు.

  Last Updated: 17 Apr 2022, 05:28 PM IST