బిహార్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం ఆర్ఎజేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కొత్త హామీ. గురువారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ప్రకటించిన ఈ హామీ యువతను ఉద్దేశించినదే. “ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టం (Government Job For Every Household) చేస్తాం” అని ప్రకటించడం బిహార్లో రాజకీయ సమీకరణాలను కుదిపేసింది. ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎజేడీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెడతామని, గరిష్ఠంగా 20 నెలల్లో ఆచరణలోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇది సాధారణ ఎన్నికల వాగ్దానం కాదని, బిహార్ యువతకు ఉపాధి హక్కుగా చట్టబద్ధ హామీగా చేయాలని తేజస్వి స్పష్టం చేశారు.
Rinku Singh: టీమిండియా క్రికెటర్కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
ఇటీవలి కాలంలో బిహార్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత క్యూలో ఉన్నారు. ఈ పరిస్థితిలో తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీ యువతలో కొత్త ఆశలను రేకెత్తించింది. “సామాజిక న్యాయం”తో పాటు “ఆర్థిక న్యాయం”కూ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంటే కేవలం కుల, వర్గ పరమైన సమానత్వం కాకుండా, ఉపాధి అవకాశాల ద్వారా కుటుంబ స్థాయిలో ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్న దృక్పథం దీనిలో కనిపిస్తోంది. బిహార్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, విద్యావంతులైన నిరుద్యోగులు ఈ హామీని ఆశాజనకంగా చూస్తున్నారు.
అయితే, తేజస్వి యాదవ్ ఈ చట్టం ఎలా అమలవుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏ శాఖల్లో ఉద్యోగాలు ఉంటాయి? అర్హత ప్రమాణాలు ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇది సాధ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుండి వస్తున్నాయి. బిహార్ ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి హామీని అమలు చేయడం ఆర్థికపరంగా కష్టసాధ్యమని విమర్శకులు అంటున్నారు. అయినప్పటికీ, రాజకీయంగా చూస్తే ఈ హామీ యువతను ఆకర్షించే సత్తా కలిగి ఉంది. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఆర్ఎజేడీకి ముఖ్య ఆయుధంగా మారే అవకాశముంది.
