. ఫాస్టాగ్ వినియోగదారులకు ఉపశమనం
. పాత, కొత్త ఫాస్టాగ్లకూ వర్తింపు
. బ్యాంకులపై పెరిగిన బాధ్యత
NHAI: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కార్లు, జీపులు, వ్యాన్లకు సంబంధించిన ఫాస్టాగ్ల విషయంలో ఇప్పటివరకు తప్పనిసరిగా ఉన్న ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో, ఫాస్టాగ్ వినియోగంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా కేవైవీ అప్డేట్ కాలేదన్న కారణంతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆలస్యాలను తొలగించేందుకే ఈ సంస్కరణ తీసుకొచ్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాహనానికి సంబంధించిన అన్ని సరైన పత్రాలు ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల కేవైవీ పూర్తి కాలేదని చెప్పి ఫాస్టాగ్ను బ్లాక్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
తాజా నిర్ణయంతో ఇలాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు తెలిపారు. ఈ మార్పుతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన ఆపుదల తగ్గి, ప్రయాణం మరింత సాఫీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజువారీగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఈ కేవైవీ మినహాయింపు కేవలం కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకే కాకుండా, ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫాస్టాగ్లకు కూడా వర్తిస్తుందని NHAI స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేదా అనుమానాలు లేని ఫాస్టాగ్లకు ఇకపై కేవైవీ తప్పనిసరి కాదు. అయితే, ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం, లేదా ఇతర నిర్దిష్ట ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే కేవైవీ ప్రక్రియ అవసరమవుతుందని అధికారులు తెలిపారు. అంటే, సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, సమస్యాత్మక సందర్భాల్లో మాత్రమే అదనపు తనిఖీలు చేపట్టనున్నారు.
వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేస్తూనే, వ్యవస్థలో పారదర్శకత, కచ్చితత్వం పెంచేందుకు NHAI కీలక చర్యలు తీసుకుంది. ఇక,పై ఫాస్టాగ్ యాక్టివేషన్కు ముందు వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను ధృవీకరించడం బ్యాంకులకు తప్పనిసరి. ఒకవేళ వాహన్ పోర్టల్లో వివరాలు అందుబాటులో లేకపోతే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఆధారంగా తనిఖీ చేసిన తర్వాతే ఫాస్టాగ్ను యాక్టివేట్ చేయాలి. ఆన్లైన్లో విక్రయించే ఫాస్టాగ్లకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. మొత్తం వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకులపైనే ఉంచడంతో, వినియోగదారులు మళ్లీ మళ్లీ డాక్యుమెంట్ల కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులకు నిరంతర, ఇబ్బందులేని టోల్ అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని NHAI వెల్లడించింది. ఈ నిర్ణయం ఫాస్టాగ్ వ్యవస్థను మరింత వినియోగదారునికి అనుకూలంగా మార్చడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.
