Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారి జీతాలను 17 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్మన్ ఎ.కె. గోయల్ వెల్లడించారు. జీతాల పెంపునకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంకు యూనియన్ల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీనిపై తదుపరి సమీక్ష 2027 నవంబర్లో ఉంటుంద న్నారు. వాస్తవానికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ప్రస్తుత 11వ వేతన ఒప్పందం 2022 నవంబర్ 01తో ముగిసింది. జీతాల పెంపుపై అప్పటి నుంచే బ్యాంకు ఉద్యోగ సంఘాలు, IBA మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్చలు ఫలించాయి కాబట్టి..17 శాతం జీతాల పెంపు 2022 నవంబరు 01 నుంచి అమల్లోకి వస్తుంది. ఈమేరకు శాలరీస్ను పెంచడం వల్ల(Salary Hike) ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏటా రూ. 8,284 కోట్ల అదనపు భారం పడుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులకు నెలలో 6 వీక్లీ ఆఫ్లు లభిస్తున్నాయి. దీనిని 8 వీక్లీ ఆఫ్లకు పెంచాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. నెలలోని అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా మార్చడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. అంటే.. ఇకపై బ్యాంక్ ఉద్యోగులు వారానికి 5 రోజులు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఇప్పటికే వారానికి 5 పని దినాలు అమలవుతున్నాయి. ఈక్రమంలోనే బ్యాంకులకు కూడా అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించాలని ఐబీఏ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
ఒకవేళ బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 పని దినాలను కేటాయిస్తే.. వారి రోజువారీ పని గంటలు మారిపోతాయి. బ్యాంకు ఉద్యోగులకు వారంలో పనిదినాలు తగ్గినా.. వారంలో చేసే పనిగంటలు మాత్రం తగ్గవు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ సంఘాలు హామీ ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రతినెలా రెండు, నాలుగు శనివారాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంక్ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. 5 పని దినాల వ్యవస్థకు మారితే, ఈ సమయాన్ని మరింత పెంచుతారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు బ్యాంక్లు పని చేస్తాయని అంచనా.