1 Killed : సిమ్లాలోని ఓ రెస్లారెంట్‌లో పేలిన సిలిండర్‌.. ఒకరు మృతి, ప‌ది మందికి గాయాలు

సిమ్లాలోని మాల్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందగా, మ‌రో 10 మంది గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 07:58 AM IST

సిమ్లాలోని మాల్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందగా, మ‌రో 10 మంది గాయపడ్డారు. మాల్ రోడ్‌లో అగ్నిమాపక దళం కార్యాలయం పక్కనే ఉన్న ఈటింగ్ జాయింట్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మాల్ రోడ్‌కి దిగువన ఉన్న మిడిల్ బజార్‌లో హిమాచలీ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన హిమాచలీ రసోయి రెస్టారెంట్ ఉంది. అక్క‌డ వంట చేస్తుండ‌గా ఒక్క సారిగా గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. పేలుడుధాటికి ఆరు షాపులు దెబ్బతిన్నాయని వ్యాపారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న పలు దుకాణాలు, ఇళ్ల కిటికీల అద్దాలు ప‌గిలిపోయాయి. ప‌క్క‌నే ఫైర్ స్టేష‌న్ ఉండ‌టంతో హుటాహుటిన సిబ్బంది చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. పేలుడుకు 20 నిమిషాల ముందు గ్యాస్ లీక్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఒకరు మృతి చెందారు. కాలిన గాయాలైన మరో పది మందిని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఐజీఎంసిహెచ్) సిమ్లాకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, పేలుడుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న బీజేపీ అధికార ప్రతినిధి కరణ్‌ నందా ఘటనపై విచారణ జరిపి దుకాణాలు దెబ్బతిన్న వారికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.