Kasturi rangan: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని రంగన్ సమర్పించారు. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.
Read Also: Pakistan Stock Market : భారత్ దెబ్బకి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైట్ క్రాష్
ఇక, కస్తూరి రంగన్ భౌతికకాయాన్ని ఏప్రిల్ 27 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్యూ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. కస్తూరిరంగన్ 1990-1994 వరకు యూఆర్ఎసీ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడ్డాయి. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత పరస్కారాలు అయిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. కాగా, ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు కస్తూరి రంగనే ఇస్రో చైర్మన్గా ఉన్నారు.