ఉత్తర ప్రదేవ్లోని మౌలో దారుణం చోటు చేసుకుంది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత కేదార్ సింగ్ మనవడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు సింగ్ను శనివారం రాత్రి 10 గంటల సమయంలో మహువార్ గ్రామంలో ఏడెనిమిది మంది వ్యక్తులు కొట్టి చంపారని ఏఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని.. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాన్షు సింగ్ 1980లో ఘోసి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత కేదార్ సింగ్ మనవడుగా గుర్తించారు. శనివారం రాత్రి అతను కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైరో డోన్వార్ గ్రామంలో పంచాయితీకి వెళ్ళాడని.., అక్కడ అతనికి, కొంతమంది వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. ఆ బృందం అతనిని కర్రలతో కొట్టారని..తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.